రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గ్రామాల్లో నిజంగా పండుగ వాతావరణం నెలకొంది. ఇటీవల ముగిసిన (Village Panchayat) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించడంతో పల్లెలన్నీ సంబరాల్లో మునిగిపోయాయి. గ్రామ పంచాయతీ (Village Panchayat) కార్యాలయాలు పూలతో, పతాకాలతో అందంగా అలంకరించబడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొత్త పాలక మండళ్ల ప్రమాణ స్వీకారోత్సవాలు గ్రామాల్లో ప్రజాస్వామ్య పండుగను తలపించాయి. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని పూలు, తోరణాలతో అందంగా అలంకరించారు. ఉదయం 11 గంటలకు సర్పంచ్ గా మద్దూరి నవ్య నాగరాజ్ గౌడ్, ఉప సర్పంచ్ గా వీరబోయిన ప్రవీణ్ ముదిరాజ్, వార్డు సభ్యులుగా వీరబోయిన మమత ఇర్ఫాన్, కనిగరె సుశీల, మహమ్మద్ ఆరిఫ్, బాధ్యతలుస్వీకరించారు. అంతకు ముందు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు జొన్నోజు నర్సింహాచారి, సుబ్రహ్మణ్యాచార్యులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగాచారి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు గ్రామ సర్పంచ్ గా బల్యాల రేఖ, సుదర్శన్ బాధ్యతల స్వీకరించారు. ఉప సర్పంచ్ గా దుంపల మోహన్ రెడ్డి, పలువురు వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. నూతన పాలక వర్గాన్ని కాంగ్రెస్ నాయకులు అభినందించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాల సందర్భంగా అనేక గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణలతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రజాప్రతినిధులకు ఆశీర్వచనాలు అందజేశారు. గ్రామ పెద్దలు, సీనియర్ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కొత్త పాలక మండలికి శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమాలకు హాజరై కొత్త సర్పంచ్లను అభినందించారు.
కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు ప్రమాణ స్వీకారం సందర్భంగా గ్రామాభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సమస్య పరిష్కారం, పారిశుధ్యం, రోడ్లు, వీధి దీపాలు, విద్యా–వైద్య సౌకర్యాల మెరుగుదల కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు.సర్పంచ్ల అభిమానులు, గ్రామ యువత పటాకులు కాల్చి, మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొన్ని గ్రామాల్లో డప్పులు, నృత్యాలతో సందడి నెలకొంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కొత్త పాలక మండళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. మొత్తంగా గ్రామాల్లో ఉత్సాహం, ఆశాభావం స్పష్టంగా కనిపించింది.
రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నెల 11న తొలి విడత, 14న రెండో విడత, 17న మూడో విడతగా పోలింగ్ జరిగింది. మూడు దశల్లోనూ పోలింగ్ ముగిసిన రోజే మధ్యాహ్నం తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి గెలుపొందిన అభ్యర్థులను అధికారులు ప్రకటించారు. అనంతరం రిటర్నింగ్ అధికారులు విజేతలకు ధృవీకరణ పత్రాలను అందజేశారు.వార్డు సభ్యులుగా ఎన్నికైన వారు గ్రామాల్లో సమావేశమై ఉప సర్పంచ్లను ఎన్నుకున్నారు.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పాలక మండళ్లు అధికారికంగా ఏర్పడ్డాయి. మొదటగా ఈ నెల 20న ఒకే రోజున ప్రమాణ స్వీకారోత్సవాలు నిర్వహించాలని అధికారులు భావించినప్పటికీ, ముహూర్త బలం కారణంగా కార్యక్రమాన్ని ఇవాళ్టికి మార్చారు. దీంతో ఒకే రోజున రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ప్రమాణ స్వీకారోత్సవాలు ఘనంగా జరిగాయి.గ్రామ స్థాయి పాలన ప్రజాస్వామ్యంలో కీలకమైన పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీలే అభివృద్ధికి పునాది అని, పల్లెల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందనే ఆశాభావం ప్రజల్లో వ్యక్తమవుతోంది. కొత్త పాలక మండళ్లు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసి గ్రామాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాయనే నమ్మకంతో పల్లెల్లో ఈ పదవుల పండుగ మరింత ఉత్సాహాన్ని నింపింది.
Also read:

