ఏపీలో పత్తర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. నిన్న సీఎం జగన్ మీద రాయి దాడి జరగ్గా.. ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (PawanKalyan) మీద కూడా రాయి దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటిస్తున్నారు. తెనాలిలో వారాహి విజయభేరి యాత్రలో జనసేనాని పాల్గొంటున్నారు. అయితే ఈ సమయంలోనే ఆయనపై ఓ వ్యక్తి రాయి విసిరాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో పవన్కు ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దుండగుడు విసిరిన రాయి పవన్ కళ్యాణ్కు (PawanKalyan) దూరంగా వెళ్లిపడింది. దీంతో జనసేనానికి ఎలాంటి గాయం కాలేదు.
మరోవైపు రాయి విసిరిన ఆగంతకుణ్ని జనసైనికులు, పవన్ కళ్యాణ్ మద్దతుదారులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే వారాహి యాత్రలో జరిగిన ఘటన పవన్ కళ్యాణ్ అభిమానులను కలవరపెట్టింది. రాయి విసిరిన వ్యక్తి ఎవరు.. ఏ ఉద్దేశంతో అతను రాయి విసిరాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాయి కనుక తగిలి ఉంటే పవన్ కళ్యాణ్ గాయపడేవారని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. జనసేనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

మరోవైపు విజయవాడలో శనివారం వైఎస్ జగన్ మీద రాళ్లదాడి జరిగింది. అజిత్ సింగ్ నగర్ వద్ద జగన్పైకి దుండగులు రాయి విసిరగా.. ఈ ఘటనలో జగన్ ఎడమకన్ను పైభాగంలో గాయమైంది. జగన్ పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి సైతం తీవ్రగాయమైంది. దీనిపై ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఏకంగా సీఎంపైనా రాళ్లదాడి జరగడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ మీద కూడా రాయి విసరడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ నేతలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వచ్చే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
Also read:
- IPL: ఐపీఎల్ టికెట్లు నిమిషంలోనే సోల్డ్ అవుట్
- Kolkata: పశ్చిమ బెంగాల్ ఉగ్రవాదులకు సురక్షిత స్థావరం
- K. Laxman : కాంగ్రెస్కు బీఆర్ఎస్గతే

