రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, ఆ పార్టీకి కేడర్ లేదని, లీడర్లు గోడమీద పిల్లుల్లా మారారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఇవాళ యూఎస్ లోని ‘‘ఒవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’మీటింగ్ లో ఆయన వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బరి తెగించిందని విమర్శించారు. ఒక సమస్య వస్తే దానిని పరిష్కరించకుండా మరో సమస్యను భుత్వం డ్రామాలాడుతోందన్నారు. హైడ్రా, మూసీ పునరుజ్జీవం, కుల గణన పేరుతో మీడియాలో ప్రచారం చేసుకుంటూ 6 గ్యారంటీలను దాటవేస్తోందని మండిపడ్డారు.
సీఎం హామీ ఇస్తే అమలు కావడం లేదన్నారు. దీంతో సీఎం ఇస్తున్న హామీలకు, చెబుతున్న మాటలకు విలువ లేకుండా పోయిందని విమర్శించారు. దక్షిణాదికి అన్యాయం పేరుతో కొత్త డ్రామాకు కాంగ్రెస్ తెరలేపిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ, నియంత, అవినీతి పాలనతో విసిగిపోయి మార్పు కోసం కాంగ్రెస్ కు ఓటేసిన ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లయిందన్నారు. ‘రైతు భరోసా ఇవ్వడం లేదు. ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ చేయలేదు. నెలరోజులుగా వడ్లను రోడ్లపై పోసి రైతులు ఎదురు చూస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించలేదు. మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలకు రూ.2500లు ఇస్తామని మోసం చేశారు.
విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇయ్యనేలేదు. రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించడం లేదు. విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులను మభ్యపెట్టేందుకు నోటిఫికేషన్లు ఇస్తోంది. నిబంధనలకు భిన్నంగా ఇస్తున్న నోటిఫికేషన్లను కోర్టులు కొట్టివేసేలా చేస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతున్నయ్. దేవాలయాలపైన, హిందూ ధర్మంపైన దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.’అని బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో 2028లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు.
నక్సల్ సానుభూతి పరులతో విద్యాకమిషన్
నక్సలైట్ సానుభూతి పరులతో విద్యా కమిషన్ ఏర్పాటు చేశారని బండి సంజయ్ విమర్శించారు. మన దేశ చరిత్రను, వివేకానందస్వామి, శివాజీ, వీరసావర్కర్ చరిత్రను కనుమరుగు చేయాలనుకునే వాళ్లే విద్యాకమిషన్ లో ఉన్నారన్నారు. అలాంటి వాళ్లతో విద్యా కమిషన్ ను ఏర్పాటు చేయడంవల్ల ప్రజలకు ఏ సంకేతాలు పంపుతున్నారో అర్ధం చేసుకోవాలని అన్నారు. ఆలయాల్లో సోషల్ మీడియా కమిటీలను నియమించాలని పీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వానికి లేఖ రాశారంటే.. హిందూ ధర్మంపై ఏ విధమైన దాడి జరుగుతుందో, పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవాలని అన్నారు.
Also read:

