ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో వందల కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో (ED Arrests) కీలక పరిణామం చోటుచేసుకుంది.జయత్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నైలో (ED Arrests) ఆయనను అదుపులోకి తీసుకున్న అధికారులు హైదరాబాద్కు తరలించారు.
ప్రీ లాంచ్ ఆఫర్ అంటూ ఇండ్లు, స్థలాలు ఇప్పిస్తామని చెప్పి శ్రీనివాస్ వందలాది మంది నుంచి డబ్బులు వసూలు చేశాడు. తక్కువ ధరకు ఇళ్లు, ప్లాట్లు ఇస్తామని ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చి పెట్టుబడులు రాబట్టాడు. అయితే డబ్బులు చెల్లించినా బాధితులకు ఇళ్లు గానీ, స్థలాలు గానీ ఇవ్వకపోవడంతో మోసం బయటపడింది. ఈ విధంగా సుమారు రూ.300 కోట్ల మేరకు మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు.
బాధితుల ఫిర్యాదుల మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ముందుగా కేసు నమోదు అయింది. ఆ కేసు ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కోణంలో మరో కేసును నమోదు చేశారు. దర్యాప్తును విస్తృతంగా చేపట్టిన ఈడీ, గత నెలలో హైదరాబాద్ నగరంలోని ఎనిమిది ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించింది.
జయత్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో పాటు దాని అనుబంధ సంస్థల్లో తనిఖీలు చేసిన అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అనేక బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. నిధులను వివిధ మార్గాల్లో మళ్లించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. షెల్ కంపెనీల ద్వారా డబ్బు తరలింపు జరిగినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసులో ఇప్పటికే ఒకసారి అరెస్టైన శ్రీనివాస్ బెయిల్పై విడుదలయ్యాడు. అయితే ఆ తర్వాత అధికారులకు అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నాడు. అతని కదలికలపై నిఘా పెట్టిన ఈడీ అధికారులు చెన్నైలో పట్టుకున్నారు. అరెస్టు అనంతరం హైదరాబాద్కు తరలించి విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ కేసులో మరికొందరి పాత్రపై కూడా అనుమానాలు ఉన్నట్లు సమాచారం. కంపెనీ డైరెక్టర్లు, మార్కెటింగ్ ఏజెంట్లు, మధ్యవర్తుల పాత్రను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కేసు తీవ్రత మరింత పెరిగింది.
ఇవాళ కాకర్ల శ్రీనివాస్ను కోర్టులో హాజరుపరచనున్నారు. కస్టడీ కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ కేసు ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న మోసాలపై మరోసారి దృష్టి పడింది. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో జరుగుతున్న అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
Also read:

