ఐటీ నగరం బెంగళూరులో ఓ రైతుకు తీరని అవమానం జరిగింది. ధోతీ కట్టుకుని వ చ్చిన రైతును షాపింగ్ మాల్లోకి సిబ్బంది అనుమతించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హవేరి జిల్లాలోని రాణేబెన్నూరు తాలూకాలోని ఆరెమల్లాపూర్ గ్రామానికి చెందిన రైతుకు ఐటీ నగరంలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన కొడుకు నాగార్జున బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో తన తండ్రిని బెంగళూరులోని జీటీ మాల్కు(GT Mall) తీసుకెళ్లి సినిమా చూద్దామనుకున్నాడు. మాల్(GT Mall) ఎంట్రన్స్లోనే తండ్రీకొడుకులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మాల్లో ఉన్న మల్టీప్లెక్స్లో సినిమా చూసేందుకు టికెట్లు కూడా బుక్ చేసుకున్నామని చెప్పినా సిబ్బంది వినిపించుకోలేదు. ఎందుకు అనుమతించడం లేదని అడిగితే ధోతీ ధరించి మాల్లోకి రాకూడదని సిబ్బంది బదులిచ్చారు. తాము చాలా దూరం నుంచి వచ్చామని, అంత దూరం వెళ్లి మళ్లీ తిరిగి రావడం కష్టమని బతిమిలాడినా సిబ్బంది పట్టించుకోలేదు. ధోతీ ధరించి వస్తే అనుమతించకూడదని మేనేజ్మెంట్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని మాల్ సూపర్వైజర్ చెప్పాడు. ప్యాంట్ ధరిస్తేనే మాల్లోకి అనుమతిస్తామని సెక్యూరిటీ సిబ్బంది ఒకరు తేల్చి చెప్పారు. దీంతో ఆ పెద్దాయన కొడుకుకు చిర్రెత్తుకొచ్చి మాల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. తన తండ్రి ఒక రైతు అని, ధోతి ధరించడంలో తప్పేం ఉందని నిలదీశాడు. దాదాపు అరగంట సేపు వాదించినా మాల్ సిబ్బంది ఆ తండ్రీకొడుకులను షాపింగ్ మాల్లో అడుగు కూడా పెట్టనీయలేదు. దీంతో తీవ్ర నిరాశతో ఆ యువకుడు, అతని తండ్రి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఖండనలతో సోషల్ మీడియా హోరెత్తింది. షాపింగ్ మాల్ సిబ్బంది తీరును మెజార్టీ నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. దేశానికి వెన్నెముక లాంటి రైతుకు తన వస్త్రధారణ కారణంగా ఇలాంటి అవమానం జరగడం అత్యంత బాధాకరమని నెటిజన్లు ట్వీట్ చేశారు. ఇంత జరిగినా ఈ ఘటనపై జీటీ మాల్ యాజమాన్యం స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ :

