తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. ఈ వ్యవహారంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా వేడెక్కించాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన (CM Revanth) సీఎం రేవంత్ రెడ్డి, చట్టం ప్రకారం అవసరమైతే కేసీఆర్కు బేడీలు వేసి ఈడ్చుకురావాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఈ తరహా చర్యలు క్షమించరానివని ఆయన స్పష్టం చేశారు.
పెండ్లాం మొగుడు మాట్లాడుకున్న వ్యక్తిగత ఫోన్లను కూడా వినే స్థాయికి వెళ్లినవారిని ఏం చేయాలని ప్రశ్నిస్తూ సీఎం తీవ్రంగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై చట్టప్రకారం చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈడ్చుకురావడానికి అవసరమైన చట్టం తమ వద్ద ఉందని, ఎవరు ఎంత పెద్దవారైనా చట్టం ముందు సమానమేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేవలం రాజకీయ నాయకులకే పరిమితం కాలేదని సీఎం ఆరోపించారు. జడ్జీలు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాన్య ప్రజలు ఇలా అన్ని వర్గాల ఫోన్లను ట్యాపింగ్ చేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నిఘా పెట్టడం అత్యంత ప్రమాదకర చర్యగా ఆయన అభివర్ణించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైన చర్యగా సీఎం వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ఉద్యమకారులకు ద్రోహం చేశారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని పక్కన పెట్టి, తమ కుటుంబ సభ్యులు, బంధువులకు పదవులు, లాభాలు చేకూర్చారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా, తమ ఇంట్లో వాళ్లకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయని ఆయన మండిపడ్డారు. చివరకు బంధువు బోయినపల్లి వినోద్ కుమార్ ఎన్నికల్లో ఓడిపోయినా, అతడికి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి ఇచ్చారని సీఎం గుర్తు చేశారు.

హరీశ్ రావు “కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరిపేయలేరు” అంటూ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా సీఎం తీవ్రంగా స్పందించారు. వాళ్ల చరిత్ర అందరికీ తెలుసని, దొంగ పాస్పోర్టులు, దొంగ నోట్ల వ్యవహారాల చరిత్రను ఎవరూ దాచలేరని వ్యాఖ్యానించారు. అక్రమ సంపాదనతో కేసీఆర్కు ఎర్రవల్లిలో, కేటీఆర్కు జన్వాడలో, కవితకు శంకర్పల్లిలో, హరీశ్ రావుకు మొయినాబాద్లో ఫాం హౌస్లు ఎలా వచ్చాయో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.

టీవీ ఛానళ్లు, పత్రికలు పెట్టుకుని ప్రజాభిప్రాయాన్ని మలుపు తిప్పే ప్రయత్నం చేశారని సీఎం ఆరోపించారు. వీళ్ల చరిత్రను రాష్ట్ర ప్రజలకు పూర్తిగా తెలిసేలా గోడల మీద రాయిస్తామని, ఎవరూ నిజాన్ని దాచలేరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుందని, ఈ వ్యవహారంలో నిజాలు బయటకు రావాల్సిందేనని ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
Also read:

