టీజీ ఐఐసీ పరిధిలోని లక్షా 75 వేల ఎకరాలను తాకట్టు పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth) స్కెచ్ చేశారని, తన వద్ద ఇందుకు నిర్దిష్టమైన ఆధారాలున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇందులో భాగంగానే టీజీఐఐసీని ప్రైవేటు లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం రహస్య జీవోను విడుదల చేసిందని అన్నారు. కంపెనీ హోదాను మార్చడం ద్వారా మరిన్ని వేల కోట్ల రుణం పొందాలన్నది ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజీలో కుదువపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోడానికి టీజీఐఐసీ ద్వారా ద్వారాలు తెరిచారని చెప్పారు. స్టాక్ ఎక్సేంజ్ లో నష్టం జరిగి తెలంగాణ భూములు జప్తు చేసుకుంటే రాష్ట్ర భవితవ్యం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(Revanth) కనీస ఆలోచన చేయకపోవడం దారుణమని అన్నారు. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 16 నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి రూ 1.8 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారని చెప్పారు. తెచ్చిన అప్పులతో ఒక్క పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని, అభివృద్ధికి వెచ్చించలేదని చెప్పారు. గతంలో చేసిన అప్పులకు కేవలం 80 వేల కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం తిరిగి చెల్లించిందని చెప్పారు. మిగిలిన లక్ష కోట్లు పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లించారన్నారు. ఇది 20 శాతం కమీషన్ సర్కార్ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కమీషన్ తీసుకున్నారని అన్నారు. దాదాపు 20 వేల కోట్లు రేవంత్ రెడ్డి సొంత ఖజానాకు వెళ్లిందని అన్నారు. తాను చెప్పింది తప్పయితే ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక మంత్రి సొంత కంపెనీకి, మెఘా కంపెనీకి బిల్లులు చెల్లిస్తున్నారు కానీ చేసిన అభివృద్ధి పనులకు కాదని అన్నారు.
Also Read :

