Medaram Jatara: మేడారం గద్దెపైకి కొద్ది సేపట్లో వరాల తల్లి సమ్మక్క

Medaram Jatara

తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం, అడవి బిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన వరాల తల్లి సమ్మక్క కొద్ది సేపట్లో మేడారం (Medaram Jatara) గద్దెపైకి చేరుకోనున్నారు. చిలుకల గుట్ట నుంచి (Medaram Jatara) మేడారం వరకు సాగే ఈ పవిత్ర ప్రయాణానికి లక్షలాది మంది భక్తులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అమ్మ రాక కోసం మేడారం ప్రాంతం అంతా భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.

Image

సమ్మక్క తల్లి రాకను పురస్కరించుకుని గ్రామస్తులు, భక్తులు సంప్రదాయ పద్ధతుల్లో ఏర్పాట్లు చేశారు. అమ్మ వచ్చే మార్గమంతా అలికి ముగ్గులు వేసి అందంగా అలంకరించారు. పూలు, ఆకులు, వేప కొమ్మలతో తల్లి రాక దారిని శుభ్రంగా సర్దారు. తల్లి అడుగుపెట్టే ప్రతి అంగుళం పవిత్రమని భావిస్తూ భక్తులు అపూర్వమైన శ్రద్ధ చూపిస్తున్నారు.

Image

ఉదయం వేళ పూజారులు కంకవనం తెచ్చి గద్దెపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిలుకల గుట్టకు వెళ్లి, రహస్య ప్రాంతంలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొని వస్తారు. ఈ సమయంలో దేవత పూజారిని ఆవహిస్తుందని భక్తుల విశ్వాసం. పూజారి ద్వారా తల్లి తన సంకల్పాన్ని తెలియజేస్తుందనే నమ్మకం తరతరాలుగా కొనసాగుతోంది.

Image

సమ్మక్క తల్లి చిలుకల గుట్ట నుంచి బయల్దేరిన సంకేతంగా జిల్లా ఎస్పీ ఏకే–47 తుపాకితో మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరుపుతారు. ఈ కాల్పులు వినిపించగానే మేడారం పరిసర ప్రాంతమంతా భక్తుల జయజయధ్వానాలతో మార్మోగుతుంది. “జై సమ్మక్క – సారలమ్మ” అనే నినాదాలతో అడవులు కూడా మారుమ్రోగుతాయి.

తల్లి మేడారానికి చేరుకునే సమయంలో భక్తులు ఆమెను తాకేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అడవీ ప్రాంతం నుంచి గద్దె వరకు ప్రతి కీలక స్థలంలో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా చర్యలు చేపట్టారు.

సమ్మక్క తల్లి రాక సందర్భంగా ఎదురుకోళ్లు ఇచ్చి భక్తులు ఘన స్వాగతం పలుకుతారు. కొందరు మొక్కులు చెల్లించుకుంటే, మరికొందరు తమ కోరికలు తీర్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలు, నృత్యాలు ఈ సమయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

Also read: